కదిరిలో లంబాడిల జీవన విధానం _ భిన్న సంస్కృతులు
___పిళ్లా కుమారస్వామి
మనకు తెలియని మన పూర్వీకుల సంస్కృతి తెలియాలంటే ఆదివాసీల సంస్కృతిని అధ్యయనం చేయాల్సి వుంటుంది. ఆదిమానవులలో ఏర్పడిన భిన్న సంప్రదాయాలు, సంస్కృతులు నేటి లంబాడీల లో వున్నాయి. వాటిని అధ్యయనం'చేయడం ద్వారా మన పూర్వీకుల సంస్కృతులు తెలుస్తాయి. అవి మెల్లగా పరిణామక్రమంలో ఎలా మార్పులు చెందాయో మనకు అర్ధమవుతుంది. గిరిజన సంస్కృతిలో గిరిజనుల ఆచార వ్యవహారాలు, వేషధారణ, ఆహారం, ఆహార సేకరణ విధానం, సంప్రదాయాలు, తెగలు, భాష మొదలైన విషయాలన్నీ వస్తాయి.
ఆంధ్రప్రదేశ్లో ఉభయగాదావరి జిల్లాల్లో కోయలు, కొండరెడ్లు, కమ్మర, యానాదులు,ఎరుకలు వున్నారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో చెంచులు వున్నారు. అనంతపురం జిల్లాలో బంజారాలు,ఎరుకలు ఉన్నారు. సవరలు, జాతవులు, గోండులు, గదబలు, బగతలు శ్రీకాకుళం జిల్లాలో వున్నారు. విజయనగరం, విశాఖ జిల్లాలలో ఎక్కువగా బగత, గదబ, మన్నె దొర, గౌడ, వాల్మీకి, గకలట్ కువి వంటితెగలు వున్నాయి.గిరిజన తెగల్లో చాలామంది వివిధ వృత్తుల్లో వున్నారు. వీరిలో 54శాతం మంది వ్యవసాయరంగంలో, 32% మంది వివిధ రంగాల కార్మికులుగా, మిగిలినవారు. గృహపరిశ్రమ వంటి పనుల్లో వున్నారు. వ్యవసాయంలో పోడు వ్యవసాయం వీరి ప్రధాన జీవన విధానం.
లంబాడిలు లేదా సుగాలీలు మైదాన ప్రాంత గిరిజనులుగా పేరు పొందారు.వీరు గిరిజనులలో 28 వ తెగ. వీరినే లంబాడ, బంజారాలు అని కూడా అంటారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ వీరి పూర్వీకులదేనని ఒక వాదన. వీరి నివాస ప్రాంతాలను తండాలు అంటారు. పూర్వం వరిచేలలో కుప్ప నూరిళ్ళపుడు దాన్యం కల్లాలు తొక్కించడానికి ఆవుల్ని తోలుకొచ్చే వాళ్ళు.లంబాడీ భాషకు లిపి లేదు. సవర భాష దీనికి దగ్గర ఉంటుందంటారు. ప్రస్తుత గిరిజన తెగలలోప్రత్యేక తెగగా కనిపిస్తారు.
తండాలలో తమ ఆచార వ్యవహారాలను పాటిస్తూనే ఉన్నారు. లంబాడీలు తండాలుగా ఏర్పడి తమ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ తండాలను జనవాసానికి దూరంగా నిర్మించుకున్నారు. అంటే బయట ఎంత పెద్దవారు ఐనా ఎంత గొప్పవారు ఐనా, తండాలోకి వచ్చి ఎలాంటి కొత్త పద్ధతులు సిద్ధాంతాలు, లంబాడీలపై రుద్దడానికి వీలులేదు. కావున బయటి మనుషులను రాణించే వారు కాదు. తండా నాయక్ (తండా పెద్ద) ఏం చెప్తే అదే ప్రజలకు శిరోధార్యం. ఒక వ్యక్తి, లేదా ప్రజలు జనవాసానికి దూరంగా ఉంటున్నారంటే వారిలో ఏదో ప్రత్యేకం ఉందని అర్ధం. లంబాడీలలో పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం, పెళ్లి, చావు, అన్ని ప్రత్యేకమైనవే. వీరు గిరిజనులు కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి.
ఇంకా నుగాలి తమ అమ్మవారి పూజ కోసం బయట సమాజంలోకి వచ్చి బస్టాండ్లలో, రోడ్ల పైన మగవాళ్ల దగ్గర డబ్బులడుగుతారు. అలా అడిగిన తర్వాత వచ్చిన సొమ్ముతో పూజలు చేస్తారు. ఆ డబ్బుతో వారు ప్రజలు పూజలు చేయాలని వారి ఆచారంగా చెప్పుకుంటారు.