Friday, September 4, 2020

రాయదుర్గం చారిత్రక నేపథ్యం

                ‌
         అనంతపురం నుండి 100కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గంకు వేల సంవత్సరాల  చారిత్రక నేపథ్యంఉంది. 
             చరిత్ర పూర్వ యుగం నుంచి జన నివాసం ఇక్కడ ఉండేది. నూతన శిలాయుగం, లోహ యుగం నాటి అవశేషాలు రాయదుర్గం సమీపంలోని అడగుప్ప  గొల్లపల్లి,బాదనహాల్ సమీపంలోని కర్నాటక రాష్ట్రం బ్రహ్మగిరి వద్ద పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో బయట పడ్డాయి. వీటి  ఆధారంగా ఆదిమానవుల వికాస
పరిణామంలో వివిధ దశలను ఈ అవశేషాలు
తెలుపుతాయి. చిన్న రాతి సమాధులు, గుంతల
మాదిరి సమాధులు గొల్లపల్లి, అడుగుప్ప వద్ద
19వ శతాబ్ది చివరిలో కనుగొన్నారు. సుమారు
700 వరకు ఇలాంటి సమాధులను కనుగొన్నారు
వీటిని సిస్టవాన్లు, ఇష్టవానులుగా పిలిచేవారు
వంద సంవత్సరాల క్రితం ఈ సమాధులకు
ఉపయోగించిన రాళ్లు, బండలను అప్పటి
తహసిల్దార్ రాయదుర్గానికి తరలించి ప్రభుత్వ
భవనాల నిర్మాణాలకు ఉపయోగించినట్లు తెలుస్తోంది
         
          మౌర్య వంశ చక్రవర్తి  అశోకుని సామ్రాజ్యం రాయదుర్గం  వరకు విస్తరించి ఉండేది. తరువాత శాతవాహనాలు రాష్ట్రకూటులు విజయనగర రాజులు రాయదుర్గాన్ని పరిపాలించినట్లు శాసనాలు చెబుతున్నాయి. 

        రాయదుర్గం పేరు వింటే చాలు రాయల ఏలుబడిలో ఉన్న ప్రాంతం అనే భావనను కలిగి స్తుంది. రాయదుర్గాన్ని మహామంత్రి తిమ్మరుసు తమ్ముడు గోవిందామాత్యుడు పరిపాలించినట్లు తెలుస్తోంది. 15వ శతాబ్దంలో పాలెగాళ్ల ప్రాబల్యం పెరగడంతో వారిని అణచివేసేందుకు విజయనగర రాజు భూపతి రాయలను ఇక్కడి కి పంపినట్లు శాసనాలు ఉన్నాయి. అతను పాలెగాళ్లను అణచివేసి తనే దుర్గానికి రాజుగా ప్రకటించు కున్నాడు. అప్పటి నుండిభూపతి రాయల దుర్గంగా పిలువబడింది.కాలక్రమంలో ఈ ప్రాంతం   రాయదుర్గంగా రూపాంతరం చెందింది.
     రాయల పాలన అనంతరం దుర్గాన్ని నాయకులు (బోయలు బేడర్లు) పరిపాలించారు. కుందుర్పి పాలకుడు పెద్దకోనేటి నాయకుడు 1652 సంవత్సరంలో రాయదుర్గం పై దాడి చేసి పెద్ది  బొమ్మనాయక్ ను జయించి ఆయన దుర్గం రాజుగా ప్రకటించుకున్నారు. బెలుగుప్ప సమీపంలోని హానకహాల్ గ్రామం వద్ద ఇందుకు సంబంధించిన శాసనం ఉంది. ఆయన అనంతరం వారసులు  వెంకటపతి నాయకుడు, తిమ్మప్ప నాయకుడు, అతని తల్లి లక్ష్మమ్మ ఆ ప్రాంతాన్ని పాలించారు.
రాయదుర్గం వీర వనిత మహారాణి లక్ష్మమ్మ , చిత్రదుర్గం పాళెగాడు బరమప్ప నాయకున్ని  తరిమికొట్టింది. ఈ దుర్గం నాయకులతో వియ్యం అందుకుని తెలుగు కన్నడ భాషలకు చుట్టరికం కలిపింది. అనంతరం ఆంగ్లేయులు, టిప్పు సుల్తాన్ మధ్య జరిగిన యుద్ధానంతరం రాయదుర్గం
ఆంగ్లేయుల పాలనలోకి వెళ్లింది. 
        దత్త మండలాల్లో భాగంగా రాయదుర్గం తొలుత బళ్లారి జిల్లాలోనూ, మద్రాసు ప్రెసిడెన్సీలో, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో అంతర్భాగమయింది.

          ‌ బలిష్టమైన గిరి దుర్గంగా ఆనాటి రాజులు దీనిని నిర్మించారు. రాయదుర్గాన్ని ఆలయాల దుర్గంగా పిలుస్తారు.కొండపైన, దిగువకు వందకు పైగా పురాతన కట్టడాలు, ఆలయాలు ఉన్నాయి.  కోటపై ఉన్న ఆలయాలు, నాలుగు ప్రాకారాల కోట, కోనేరు, బురుజులు, కట్టడాలను పరిశీలిస్తే ఒకప్పుడు అని మహోన్నత దుర్గంగా వెలసినట్లు అర్థం అవుతుంది. తర్వాత కాలంలో వీటికి రక్షణ కరువై శిథాలావస్థకు గురైనాయి. 
 
జైనుల ఆనవాళ్లు

       సిద్దేశ్వరాలయం ఆనాటి జైన విద్యాలయంగా విలసిల్లినట్లు అక్కడ ఉన్న శాసనం ద్వారా తెలుస్తుంది. కొనకొండ్లలో  నివాసం ఉన్న కుందాచార్యులు  ఆ విద్యాలయాన్ని స్థాపించినట్లు అందులో పేర్కొన్నారు. జైనతీర్ధంకుల విద్యాభ్యాసం తదితర చిత్రాలన్ని శిలా శాసనాలలో  కన్పిస్తాయి.

       బౌద్ధ,జైన,శైవ, వైష్ణవ మతాలు ఈ ప్రాంతంలో సామరస్యంతో మసిలాయి. కొండపై పల్నాడు యల్లమ్మ, మాధవరాయస్వామి. పట్టాభి సీతారామ స్వామి,  వెంకటరమణ స్వామి,దశభుజ గణపతి, 

వేణుగోపాలస్వామి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి తదితర పురాతన ఆలయాలు ఉన్నాయి.
మూడు కన్నులతో దశభుజాలతో చేతిలో సుదర్శనాయుధాన్ని పట్టుకొని అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలోప్రథమారాధ్యుడు కొలువైనాడు. ఈ స్వామికి పది చేతులుండడంతో దశభుజగణపతిగా ప్రసిద్ధి కెక్కినాడు. ఫాలభాగంలో మూడవ నేత్రంతో అరిష్టాలను తొలగించే వానిగా ఖ్యాతి చెందాడు కనుకనే ఈ గణపతిని ముక్కంటి గణపతిగా కొనియాడబడుతున్నాడు.  
ఇక్కడి గజాననుడు పదిచేతులలో - నారికేళం, చక్రం, త్రిశూలం, ధనుస్సు, అంకుశం, శంఖం, పవిత్రం, శరం, ఖడ్గంలాంటి ఆయుధాలను ధరించి తన దేవేరి అయన సిద్ధితో కలసి దర్శనం ఇస్తాడు.
ఈ స్వామి ఎడమ అరికాలి కింద అష్టదళ పద్మం వికసించి ఉంటుంది. ఇలాంటి గణపతి స్వరూపాన్ని మహాగణపతిగా ఆరాధిస్తారు. ఈముక్కంటి గణపతి ఆధ్యాత్మిక సాధన చేసేవారి సాధనలు ఫలప్రదం చేయడంలో ముఖ్యడంటారు.ఈ దశభుజగణపతి కోరిన కోరికలు సిద్ధింపచేసే వానిగా ప్రసిద్ధి కెక్కిసిద్ధివినాయకుడన్న ఖ్యాతి గడించాడు. ఈ స్వామికి కుడివైపున సూర్యుడు, ఎడమవైపున చంద్రుడూ ఉంటారు. వీని వల్ల విశ్వగణపతిగా కీర్తిస్తారు. సుఫలాలను ప్రసాదిస్తారనడానికి ప్రతీకగా స్వామి చేతిలో నారికేళం ఉంటుంది. ఈ దశభుజగణపతికి కోరికను చెప్పి ముందు ఒక కొబ్బరికాయను కొట్టి కోరిక తీరిన తర్వాత తిరిగి 107 కొబ్బరికాయలను నివేదించడం ఇక్కడి ఆచారం. ఈదశభుజ గణపతి ఆలయాన్ని పద్నాల్గవ శతాబ్దంలో భూపతిరాయలు నిర్మించారని చారిత్రికాధారాలు చెబుతున్నాయి. మంగళవారాల్లో మహాగణపతికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతినెలా సంకటాలు తొలిగించమని కోరుతూ సంకట చతుర్థిని నిర్వహిస్తారు. ఈ దశభుజ గణపతి ఆలయం పక్కనే నరసింహుని ఆలయం కూడా ఉంది. లక్ష్మీదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కొలువైన ఈ నరసింహుని ఆలయం కూడా రాయలనాటి కాలంనాటిదని అంటారు. వీటిని చూడడానికి యాభైకిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక బళ్లారి నుంచి యాత్రీకులు అనేకమంది ప్రతిరోజు వస్తుంటారు.


      రాయదుర్గం ప్రాచీన చరిత్ర  ఔన్యత్యాన్ని కాపాడడానికి కేంద్ర పురావస్తు శాఖ కేవలం రెండు ఆలయాల వద్ద మాత్రమే ప్రాచీన స్మారక చిహ్నాల నోటీసు బోర్డులను ఏర్పాటు చేసింది.మాధవరాయ స్వామి ఆలయాన్ని పునరుద్ధరణ గావించింది.కొండ పై ప్రజలు వెళ్లి వచ్చేందుకు అనువైన రహదారిని, పర్యాటకులు అక్కడికి వెళ్లి వచ్చేందుకు కనీస అవసరాలు, తాగునీరు, వీధి దీపాలను కల్పించడం
చేస్తే పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది.

No comments:

Post a Comment