Tuesday, September 8, 2020

అభివృద్ధికి నోచని రాయదుర్గం రైల్వే స్టేషన్‌


           అనంతపురం జిల్లా సరిహద్దున గల రాయదుర్గం రైల్వే స్టేషన్‌ కు 115 సంవత్సరాల చరిత్ర వుంది. కరువు ప్రాంతాల అభివృద్ధి, ఇనిజ వనరులు,వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ దృష్యా ఆంగ్లేయులు 1905 సంవత్సరంలో బళ్లారి, రాయదుర్గం నడుము మీటర్ గేజ్ రైలు మార్గాన్ని ప్రారంభించారు. అప్పుడు నిర్మించిన స్టేషన్ భవనం నేటికి చెక్కు చెదరలేదు. 130 సంవత్సరాల
క్రితం బర్మింగ్ హామ్ (ఇంగ్లాండ్)లో తయారైన సరుకులు తూచే యంత్రం నేటికి పనిచేస్తుంది. బళ్లారి రాయదుర్గం నడుమ తిరిగే ప్యాసింజర్ రైలు లాభదాయకంగా లేదని 1980 సంవత్సరంలో నిలిపి వేశారు. రైలు పట్టాలను తొలగించాలని రైల్వే బోర్డు నిర్ణయిస్తే స్థానికులు ఆందోళన చేపట్టారు. 1982 సంవత్సరంలో అప్పటి రైల్వే శాఖ సహాయ మంత్రి జాఫర్ షరీఫ్ పుణ్యాన‌రాయదుర్గం-చిత్రదుర్గం నడుమ కొత్త రైలు మార్గం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చిత్రదుర్గం నుంచి చెల్లెకెర వరకు మీటర్ గేజ్ మార్గం ఏర్పాటు కాగా రైల్వే బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు యూనిగేజ్ విధానం వల్ల
మొత్తం రైలు మార్గం బ్రాడ్ గేజ్ గా రూపాంతరం చెందింది.
      1993-94లో నిర్మాణం పూర్తికాగా బెంగుళూరు -
హోస్పెట్, చిక్క జాజూరు-గుంతకల్లు నడుమ రాయదుర్గం మీదుగా రెండు ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెట్టారు. 2011 సంవత్సరం అక్టోబర్ లో రాయదుర్గం నుంచి కర్నాటక రాష్ట్రంలోని తుముకూరు వరకు కళ్యాణదుర్గం, పావగడ,
మడకశిర, కొరటిగెర మీదుగా తుముకూరు వరకు కొత్త రైలు మార్గ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మన రాష్ట్ర సరిహద్దు వరకు నిర్మాణం పనులు పూర్తయ్యే కదిరిదేవరపల్లి నుంచి రాయదుర్గం మీదుగా తిరుపతికి ప్యాసింజర్ రైలును ప్రవేశపెట్టారు. కర్నాటక ప్రాంతంలో తుముకూరు వరకు రైలు మార్గం నిర్మాణం చేపట్టాల్సి వుంది. ఇది పూర్తయితే
పలు ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఈ మార్గంలోకి మళ్లించడం కొత్త సర్వీసులు ప్రవేశపెట్టడం జరుగుతుంది.
ప్రస్తుతం చిత్రదుర్గ రాయదుర్గం మార్గంలో 5
ఎక్స్ ప్రెస్ రైళ్ళ తిరుగుతున్నాయి. వీటిలో వారానికి రెండు సార్లు ప్రయాణించే ట్రైన్ నెంబర్ 06223-06224 శివమొగ్గ-రేణిగుంట_ శివమొగ్గ ఎక్స్ ప్రెస్ రైలు మాత్రం రాయదుర్గంలో ఆగుతుంది. అయితే యశ్వత పూర్ నుంచి జైపూర్, వారణాసి, కాట్రా, మైసూరు నుంచి కాట్రా నగర్ కు ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నా రాయదుర్గం లో ఆగటం లేదు. రాయదుర్గం -చిత్రదుర్గం నడుమ, మరియు రాయదుర్గం నుంచి తుముకూరుకు రైలు
మార్గం నిర్మిస్తున్నప్పుడు కాని రైల్వే అధికారులు రాయదుర్గం జంక్షన్, రైల్వే స్టేషన్లో మౌలిక సౌకర్యాల కల్పనలో ఉదాసీన వైఖరి అవలంభించారు. పాత స్టేషన్ భవనాన్ని కదల్చకుండా ప్లాట్ ఫారం కొంత ఎత్తు చేసి పొడిగించారు. అయితే ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగేంత పొడవుగా ప్లాట్ ఫారాలు లేవని రైల్వే అధికారులు ఇక్కడ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపడం
లేదు. రెండు సంవత్సరాల క్రితం రూ. 9.5 కోట్ల వ్యయంతో కొత్త స్టేషన్ భవనం అదనపు ప్లాట్ ఫారం రైల్వే లైన్ ఏర్పాటుకు రైల్వేశాఖ నిధులు మంజూరు చేసింది. మట్టి పనులు మొదలు పెట్టినా సిగ్నలింగ్ వ్యవస్థ మార్చాలని పనులకు అడ్డుగా వుందని మరో కారణం సాకుతూ నిర్మాణం పనులు చేపట్టడంలో జాప్యం చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు స్టేషన్ భవనం నిర్మాణం కాని, ఆధనపు ప్లాట్ ఫారం,
రైలు మార్గం నిర్మాణం పనులు కాని మొదలు పెట్టలేదు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ భవనం తొలగించి ఆ స్థలంలో మొత్తం 5 వరుసల రైలు మార్గాన్ని కొత్త స్టేషన్ భవనాన్ని నిర్మించాలని అధికారులు ప్రతిపాధనలు చేశారు. అయితే ప్రస్తుతం స్టేషన్లో ప్రయాణికులకు మౌలిక సౌకర్యాల కొరత తీవ్రంగా వుంది. హోస్పేట-బెంగుళూరు నడుమప్రయాణించే ప్యాసింజర్ రైలు బెంగుళూరు నుంచి బయలు
దేరే వేళలను మార్చడంతో స్థానికంగా బక్షారి, హోస్పేట వెళ్ళే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ పట్టణాలకు ప్రతి రోజు సుమారు 300 మంది దాకా ప్రయాణించే వారు. అయితే గతంలో వున్న 8 గంటల స్థానంలో ఉదయం 4 గంటలకే రైలు రాయదుర్గం స్టేషన్
నుంచి బళ్లారికి వెళ్లడం వల్ల అక్కడికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం సగటున 400 మంది ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రోజుకు రూ.60వేలు ఆదాయం వస్తుంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా రైల్వే శాఖ డీజల్ ఇంజన స్థానంలో విద్యుత్ నడిచే లైలు ఇంజన్లను ప్రవేశపెట్టింది. బళ్ళారి రాయదుర్గం రైలు మార్గం విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. చిత్రదుర్గం వరకు పూర్తయితే ఈ మార్గంలో విద్యుత్ ఇంజిన్ లో ప్రయాణించే రైళ్ళు తిరుగుతాయి.

పుట్ ఓవర్ అడ్డి నిర్మించాలి...

స్థానిక రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఒక ప్లాట్
ఫారం నుంచి మరో ప్లాట్ ఫారంకు వెళ్లాలంటే రైలు
పట్టాలను దాటాల్సి వుంది. ఇది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడమే కాక ప్రమాదకరమైనది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులు కోరు తున్నారు. ప్రస్తుతం రాయదుర్గం- అనంతపురం రోడ్డు మార్గంలో రైలు పట్టాలపై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ దశలో వుంది. కణేకల్లు రోడ్డులో నిర్మించాల్సి వుంది. రాయదుర్గం నుంచి సగటున ప్రతి రోజు 8 ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లు, 30 గూడ్స్ రైళ్లు
తిరుగుతున్నాయి. ప్యాసింజర్ రైళ్ల రద్దీ తక్కువగా
వుండటంతో గూడ్స్ రైళ్ల రవాణాకు ఈ మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. రైలు వచ్చిన ప్రతి సారి రోజుకు సుమారు 40 సార్లు రోడ్డు మార్గంలో రైల్వే గేటు వేయడం వల్ల ఈ మార్గంలో ప్రయాణించు వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జిలను గేట్ల స్థానంలో నిర్మించాలని వాహన చోదకులు కోరుతున్నారు.

స్టేషన్లో పలు రైళ్లారు ఆపాలి.

రాయదుర్గం గార్మెంట్ పరిశ్రమకు ప్రసిద్ధి గాంచగా ఇక్కడి నుంచి ఏటా వందలాది కోట్ల రూపాయల
గార్మెంట్ ఉత్పత్తులు, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి, రవాణా అవుతాయి. నిత్యమూ ప్రజలు పరిపాలన, వ్యాపార, వ్యవహార, వైద్య, ఇతర పనుల విషయమై కర్నాటక రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాలకు ప్రయాణిస్తుంటారు. వారి సౌకర్యార్థం దూర ప్రాంతాలకు వెళురైళ్లను ఇక్కడ ఆపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రాయదుర్గం-తుముకూరు రైలు మార్గాన్ని వెంటనే పూర్తి చేయడం వల్ల బెంగుళూరు గుంతకలు,
బెంగుళూరు-హుబ్బళ్లి నగరాల మధ్య తిరుగు రైళ్ల రద్దీని తగ్గించేందుకు తుముకూరు - రాయదుర్గం మార్గంలో పలు రైళ్లను మళ్లించవచ్చు. తద్వారా రాయదుర్గంలో, జిల్లాలోని పశ్చిమ ప్రాంత పట్టణాలు కళ్యాదుర్గం, కంబదూరు, మడకశిర మొదలైన పట్టణాల ప్రాంతాల ప్రజల సామాజిక,ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. వెనుకబడిన అనంతపురంజిల్లాను రైలు రవాణా సౌకర్యాలు మెరుగు పరచడం ద్వారా
అభివృద్ధి చేయవచ్చు. ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు వాస్తవ పరిస్థితిని గ్రహించి జిల్లాలో రైలు రవాణా వ్యవస్థ అభివృద్ధికి రైల్వే అధికారులపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది.

(శివకుమార్_ రాయదుర్గం)

No comments:

Post a Comment